ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై ఆగి ఉన్న కమ్యూటర్ రైలును వేగంగా వచ్చిన మరొక రైలు బలంగా ఢీకొనడంతో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 84 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు అత్యంత విషాదకరంగా మారాయి. ఒక లెవల్ క్రాసింగ్ వద్ద ‘గ్రీన్ ఎస్ఎమ్’ టాక్సీ అనుకోకుండా పట్టాలపై చిక్కుకుపోయింది.
ఆ సమయంలో అటుగా వచ్చిన స్థానిక కమ్యూటర్ రైలు టాక్సీని ఢీకొనడంతో, ఆ రైలు అక్కడే నిలిచిపోయింది. ఈలోపు అదే మార్గంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ‘ఆర్గో బ్రోమో ఆంగ్గ్రేక్’ లాంగ్ డిస్టెన్స్ రైలు, పట్టాలపై ఆగి ఉన్న కమ్యూటర్ రైలు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కమ్యూటర్ రైలులోని చివరి బోగీ నుజ్జునుజ్జు అయింది.
దురదృష్టవశాత్తు, ఢీకొన్న ఆ చివరి బోగీ మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించబడినది, మృతుల్లో ఎక్కువ మంది మహిళలను అధికారులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గ్యాస్ కట్టర్లు, భారీ యంత్రాల సాయంతో అధికారులు బోగీలను తొలగించి, అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
ప్రమాదంపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సూచిస్తూ, బాధితుల వైద్య ఖర్చులతో పాటు అంత్యక్రియల బాధ్యతను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రైల్వే శాఖ మరియు జాతీయ భద్రతా రవాణా కమిటీ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సిగ్నలింగ్ లోపమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడానికి స్థానిక ప్రజలు కోరుతున్నారు.
.webp)