ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ సందర్బంగా ఆయన కొత్త లుక్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విదేశీ పర్యటనల సమయంలో పూర్తి భిన్నంగా మోడ్రన్ లుక్లో కనిపించడం రివాజే.
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
కాగా జగన్ తాజా విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు ఈసారి కఠిన షరతులు విధించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు, విదేశాల్లో ఉండే సమయంలో ఆయన ఉపయోగించే ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, పూర్తి చిరునామాను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పర్యటన ముగిసిన వెంటనే తిరిగి వచ్చి కోర్టు విచారణకు హాజరు కావాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.
