నౌకా దిగ్బంధనం, హర్మూజ్ పై పూర్తి స్థాయి పట్టు అంటూ అమెరికా అధ్యక్షుడు చెబుతున్న మాటలన్నీ డొల్లని తేలిపోయింది. హార్ముజ్ జలసంధిపై పూర్తి పట్టు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేస్తున్న ధీమాకు పూర్తి స్థాయిలో అక్కడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా విధించిన సముద్ర దిగ్బంధాన్ని కొనసాగిస్తూ ఇరాన్ చమురు ట్యాంకర్లు గల్ఫ్ జలాల గుండా ప్రయాణిస్తున్నట్లు నివేదికలు తేటతెల్లమవుతున్నాయి. అమెరికా నిఘా నేత్రాలను తప్పించుకుని ఇరాన్ సాగిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కనీసం 34 ఇరాన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటినట్లు సమాచారం. వీటిలో 19 నౌకలు గల్ఫ్ నుంచి వెలుపలికి, మరో 15 లోపలికి ప్రవేశించాయి. ఈ రవాణా ద్వారా దాదాపు 10.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విదేశాలకు తరలించినట్లు అంచనా. దీని అంతర్జాతీయ విలువ దాదాపు 910 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో 7,600 కోట్ల రూపాయలు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
అమెరికా రాడార్ల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ డొరెనా వంటి భారీ ట్యాంకర్లు తమ ఉనికిని చాటే ట్రాన్స్పాండర్లను ఆపివేసి ( ప్రయాణిస్తున్నాయి. ఇలా రహస్యంగా జలసంధిని దాటిన తర్వాత.. నడిసముద్రంలో ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురు మార్పిడి చేస్తూ, ఆ చమురు ఏ దేశానిదో తెలియకుండా జాగ్రత్త పడుతోంది.
అదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఏ నౌకైనా తమ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అనుమతి తీసుకోవాల్సిందేనని విస్పష్టంగా చెబుతోంది. పౌర విమానాలు, నౌకలకు ప్రత్యేక మార్గాలను కేటాయించిన ఇరాన్.. విదేశీ సైనిక నౌకల కదలికలపై నిఘా ఉంచింది. ఇటీవల భారత, ఫ్రెంచ్ నౌకల సమీపంలో కాల్పులు జరగడం ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రస్తుతం గల్ఫ్ జలాల్లో నెలకొన్న ఈ డబుల్ బ్లాకేడ్ అంటే.. అమెరికా ఆంక్షలు, ఇరాన్ హెచ్చరికలు అంతర్జాతీయ వాణిజ్యానికి సవాలుగా మారాయి. అమెరికా తన దిగ్బంధం విజయవంతమైందని చెబుతున్నప్పటికీ.. ఆ దిగ్బంధం విఫలమైందని ట్యాంకర్ల రాకపోకలు స్పష్టం చేస్తున్నాయి.
