భారత రాజకీయ యవనికపై తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ఒక అజేయమైన రాజకీయ దుర్గంగా నిలిచింది. దశాబ్దాల పాటు వామపక్షాలు, ఆపై దశాబ్దన్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం వహించిన ఈ గడ్డపై బీజేపీ తొలిసారిగా విజయం సాధించడం జాతీయ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందన్న నినాదం ఈ విజయంతో నిజమైందని విశ్లేషకులు. బెంగాల్ లో బీజేపీ సాధించిన ఈ ఘన విజయం.. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన.. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయంలో అభివర్ణించారు. ప్రజల శక్తికి ఇది నిదర్శనమన్న ఆయన.. సుపరిపాలన వైపు బెంగాల్ అడుగులు వేస్తోందని చెప్పారు. మూడు దశాబ్దాల కమ్యూనిస్ట్ పాలనను, ఆపై సుదీర్ఘకాలం సాగిన మమతా బెనర్జీ ప్రాబల్యాన్ని తట్టుకుని బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం సామాన్య విషయం కాదు. ఇది తూర్పు దేశంలో బీజేపీ రాజకీయ యాత్రకు ఒక బలమైన భారత పునాదిగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విజయంపై స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకత్వం భారతదేశానికి ఉండటం వల్ల ఆ దేశ ప్రజల అదృష్టమని ఆయన ప్రశంసించారు. గ్లోబల్ లీడర్ల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు మరియు స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ రాజకీయాలు ఈ స్పందనలో ప్రతిబింబిస్తాయి. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితంపై అగ్రరాజ్య అధినేత స్పందించడం అనేది అంతర్జాతీయ స్థాయిలో మోదీ బ్రాండ్ ఇమేజ్ ఎంతగా విస్తరించిందో స్పష్టం చేస్తోంది.
ప్రపంచంలోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ విజయంపై విశ్లేషణలు వెలువరించాయి. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక హిందూ నేషనలిస్టులు ప్రతిపక్ష కోటను జయించారు అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించారు. భారతదేశాన్ని తనదైన శైలిలో మార్చడానికి మోదీ దీర్ఘకాలిక లక్ష్యంలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా అభివర్ణించింది. ఇక పోతే బ్రిటిష్ వార్తా సంస్థ ది గార్డియన్ బీజేపీ ఆధిపత్యానికి చిట్టచివరి అడ్డంకిగా ఉన్న బెంగాల్ పతనం కావడం.. బలహీనపడుతున్న ప్రతిపక్షానికి మరో పెద్ద దెబ్బ. ప్రపంచవ్యాప్తంగా బెంగాల్ ఫలితాలను భారత ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఒక భారీ మార్పుగా చూస్తున్నారు.
బీబీసీ తన విశ్లేషణలో బెంగాల్ను అత్యంత కఠినమైన రాజకీయ సరిహద్దుగా గుర్తించింది. మోదీ పాలనలో ఇది అత్యంత కీలకమైన గెలుపనీ, తూర్పు భారత్ నుంచి దేశంపై పూర్తి స్థాయి పట్టు సాధించడానికి బీజేపీకి ఇది మార్గం సుగమం చేసిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలో కూడా ఈ ఫలితాలపై కథనాలు, విశ్లేషణలూ వెలువడ్డాయి. పాకిస్తాన్కు చెందిన డాన్ వంటి పత్రికలు బీజేపీని నేషనలిస్ట్ పార్టీగా అభివర్ణిస్తూ.. బెంగాల్లో ఆ పార్టీ విజయం సరిహద్దు భద్రత, ప్రాంతీయ సమీకరణలపై చూపే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సరిహద్దు, శరణార్థుల పట్ల బీజేపీ తీసుకోబోయే కఠిన నిర్ణయాలు దక్షిణా రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిశితంగా పరిశీలిస్తుంది.
ఆర్థిక కోణంలో చూస్తే, సిటీ వంటి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు ఈ విజయాన్ని రాజకీయ సుస్థిరతకు సంకేతంగా చూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒకే పార్టీ సమన్వయంతో పనిచేయడం వల్ల సంస్కరణల అమలు వేగవంతం అవుతుందని అంచనా వేస్తోంది. అయితే, ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియలో జరిగిన కొన్ని పరిణామాలు, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆరోపణలను కూడా అంతర్జాతీయ మీడియా ప్రస్తావించింది. సుస్థిరతతో పాటు సామాజిక ఐక్యతను కాపాడటం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది.
ఈ చరిత్రాత్మక మార్పు భారత ఫెడరల్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలోనూ, అత్యధిక రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ ఆధిపత్యం కొనసాగినప్పుడు రాష్ట్రాలు స్వయంప్రతిపత్తిపై ఒత్తిడి పెరుగుతుందా లేక అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే, జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందా అనే అంతర్జాతీయ మేధావులు ప్రచారం చేస్తున్నారు.
– సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.
.webp)