భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు. దేశ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్) భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. శత్రుదేశాల గుండెల్లో నిద్రపోయే అత్యంత అధునాతన 114 డాసాల్ట్ రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ కసరత్తు ముమ్మరం చేసింది. సుమారు 3.25 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో కూడిన ఈ రక్షణ ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా కేవలం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడమే కాకుండా, యూరోపియన్ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా భారతదేశంలోనే స్థానికీకరించడం ఈ డీల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ భారీ రక్షణ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం మేక్ ఇన్ ఇండియా విధానం. మొత్తం కొనుగోలు చేయబోయే 114 యుద్ధ విమానాలలో దాదాపు 90 శాతం భాగాలను, అంటే దాదాపు 90 జెట్లను స్వదేశీ సాంకేతికతతో భారత్లోనే నిర్మించాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో 2016 సంవత్సరంలో జరిగిన అంతర్ ప్రభుత్వ ఒప్పందం ద్వారా ఫ్రాన్స్ నుంచి మనదేశం 36 రఫెల్ ఎఫ్3 యుద్ధ విమానాలను నేరుగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆ విమానాలు అంబాలా, హసీమారా ఎయిర్బేస్లలోని స్క్వాడ్రన్లలో దేశ రక్షణ విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే.. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న స్క్వాడ్రన్ల కొరతను అధిగమించడానికి, అలాగే పాతబడిపోతున్న విమానాల స్థానంలో సరికొత్త శక్తులను చేర్చడానికి ఈ సరికొత్త ఎఫ్4, ఎఫ్5 రఫేల్ వెర్షన్ల కొనుగోలు అనివార్యంగా మారింది. భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇప్పటికే ఈ రఫెల్ ప్రాజెక్టులో భాగస్వామిగా మారింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ద్వారా రఫేల్ విమానాలకు అవసరమైన ఫ్యూజ్లేజ్ (విమాన మధ్యభాగం) తయారీ ప్రక్రియ దేశంలో జోరందుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ప్రతి ఏటా 24 రాఫెల్ ఫ్యూజ్లేజ్లను, వాటికి సంబంధించిన ఎయిర్ఫ్రెమ్ డిజైన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను టాటా సంస్థ ఉత్పత్తి చేయనుంది.
ఫ్రాన్స్ దేశం వెలుపల ఇలాంటి కీలక భాగాలు తయారవ్వడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక్కడ తయారవుతున్న విమాన భాగాలు డాసాల్ట్ ఏవియేషన్ ఫ్రెంచ్ యొక్క అంతర్జాతీయ సప్లై చైన్కు అనుసంధానించబడుతున్నాయి. ఈ 114 విమానాల ఒప్పందం పూర్తిగా కార్యరూపం దాలిస్తే.. దేశీయంగా ఈ విమాన విడిభాగాల ఉత్పత్తి మరింత విస్తృతం. యుద్ధ విమానాల బాడీ మాత్రమే కాకుండా, వాటి గుండెకాయ లాంటి ఇంజిన్లను కూడా భారత్లోనే తయారు చేసేందుకు ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సాఫ్రాన్’ముందుకు వచ్చింది. రఫెల్ జెట్లలో ఉపయోగించే శక్తిమంతమైన ఎమ్88 ఇంజిన్ల అసెంబ్లీ లైన్ను భారతదేశంలోనే ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతిపాదించింది. ఫ్రాన్స్ నుండి విడిభాగాలను తీసుకొచ్చి భారత్లోనే పూర్తి స్థాయిలో ఈ జెట్ ఇంజిన్లను సిద్ధం చేయడం ద్వారా దేశీయ ఏరోస్పేస్ రంగానికి భారీ ఊతం లభించనుంది.
విమాన భాగాలు, ఇంజిన్లు దేశీయంగానే అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో విమానాల నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల సమస్యలు తలెత్తకుండా వాయుసేన పూర్తి స్వయంసమృద్ధిని సాధిస్తుంది. ఈ 114 రఫేల్ జెట్ల ప్రాజెక్టు కేవలం విమానాల అసెంబ్లీకి మాత్రమే పరిమితం కాకుండా, భారతీయ ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఇంజిన్లు, ఎలక్ట్రానిక్ బాక్సులు, ఇతర కీలక పరికరాల తయారీ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్-బాంబర్ మల్టీ రోల్ జెట్లుగా పేరుగాంచిన రఫెల్ ఎఫ్4, ఎఫ్5 సాంకేతికతను మన దేశీయ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల భారత రక్షణ పరిశ్రమ స్థాయి చైనా, యూరప్ దేశాల సరసన నిలుస్తోంది. దేశీయంగా ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థ ఈ మెగా ప్రాజెక్టులో ప్రధాన అసెంబ్లీ భాగస్వామిగా వ్యవహరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, వైమానిక దళంతో పాటు భారత ఇండియన్ నేవీ కూడా రాఫెల్ శక్తులను తమ చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 26 రఫెల్ఎమ్ (మెరైన్) జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
విమాన వాహక నౌకల డెక్ ల పైనుంచి కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా కేటాపుల్ట్, స్టాప్-ఆఫ్-పుల్ వంటి అత్యాధునిక సౌకర్యాలకు అనుకూలంగా ఉండేలా ఈ మెరైన్ వెర్షన్లను డిజైన్ చేశారు. భారత నౌకాదళ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా, స్థానిక ఎమ్మార్వో సౌకర్యాలతో కూడిన నౌకాదళ యుద్ధ జెట్ వ్యవస్థను సిద్ధం చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతని ప్రభుత్వం ఫ్రాన్స్తో కొనసాగిస్తున్న సుదీర్ఘ దౌత్య, రక్షణ సంబంధాలు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ప్రధాన కారణం. జాతీయ భద్రత, రక్షణ రంగ సన్నద్ధతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా జీ7 శిఖరాగ్ర సదస్సులలో ఇరు దేశాల మధ్య ఈ రఫెల్ ప్రాజెక్టులపై విస్తృత చర్చలు జరిగాయి. ఈ అధునాతన రఫెల్ విమానాల రాకతో భారత్-ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్యం ప్రపంచంలోనే సరికొత్త రక్షణ మైత్రిగా అవతరించబోతోంది.
ఇరు దేశాల మధ్య కుదరబోయే ఈ వ్యూహాత్మక అంతర్జాతీయ అంతర్జాతీయ రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ను సెట్ చేయనుంది. చివరిగా.. ఈ 3.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి అనేది కేవలం విదేశీ కొనుగోలు కాదు. ఇది భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీని వేగవంతం చేస్తుంది, అపారమైన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది మరియు దేశీయ ఏరోస్పేస్ అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుంది. వాయుసేన ఎదుర్కొంటున్న స్క్వాడ్రన్ల కొరత శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, రాబోయే దశాబ్దాల కాలం పాటు భారతదేశ రక్షణ రంగానికి ఒక బలమైన, సుస్థిరమైన భవిష్యత్తును ఈ రఫేల్ ఒప్పందం అందించబోతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
