ఏడాది పాటు ప్రధాని బంగారాన్ని కొనవద్దని ప్రజలకు పిలుపు ఇచ్చిన మోడీ.. పిలుపు ఇచ్చి ఊరుకోలేదు. కొనాలని భావించినా జనం బంగారం కొనడానికి వెనుకాడేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న ఈ శాతాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో పెరుగుతున్న బంగారం వినియోగాన్ని అరికట్టి, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ సుంకం బుధవారం (మే 13) నుంచే అమలులోకి వచ్చింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతున్నాయి. దీంతో భారత్ తన చమురు కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అనవసరమైన విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనవద్దనీ, ఉద్యోగులు కోవిడ్ సమయంలో విజయవంతం అయిన వర్క్ ఫ్రం హోం పద్ధతిని పాటించాలని మోడీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం ద్వారా బంగారం కొనుగోలు విషయంలో ప్రజలు వెనుకడుగు వేయక తప్పని పరిస్థితి కల్పించారు. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఏడాది పాటు ప్రజలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని, అనవసరమైన విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని విజ్ఞప్తి రోజుల వ్యవధిలోనే ఈ పన్ను పెంపు నిర్ణయం తీసుకోవడం. మరోవైపు, పన్నుల పెంపు వల్ల దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు అంటున్నారు.
ఇప్పటికే రికార్డు స్థాయి ధర పలుకుతున్న బంగారం, సుంకం పెంపుతో మరింత ప్రియం అవుతుందని అంటున్నారు. దీంతో పసిడి ప్రియులు కొన్నాళ్ల పాటు బంగారం కొనుగోళ్లకు అనివార్యంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితిని మోడీ తీసుకొచ్చారంటున్నారు.
