సాధారణంగా అంటరాని, సామాజిక వివక్ష లేదా కుల వ్యవస్థ అనగానే మనందరికీ ముందుగా భారతదేశం, ఇక్కడి సామాజిక రుగ్మతలే గుర్తుకు వస్తాయి. కానీ ఆధునిక ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే, యూరప్ ఖండంలో కూడా శతాబ్దాల పాటు అత్యంత క్రూరమైన వివక్ష కొనసాగుతోంది. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో నివసించే కాగోట్స్ (కాగోట్స్) అనే సామాజిక వర్గం ఎదుర్కొన్న వేధింపులు మానవ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి.
మతం, భాష, రూపం అన్నీ ఒకేలా సమానంగా ఉంటాయి. అంటే కేవలం పుట్టుక ఆధారంగా ఒక వర్గం సమాజం నుంచి ఏ విధంగా వెలివేతకు గురైందో.. కాగోట్స్ చరిత్ర కళ్లకు కడుతుంది. మధ్యయుగం నుండి ఆధునిక కాలం వరకు పశ్చిమ ఫ్రాన్స్, ఉత్తర స్పెయిన్లోని బియార్న్, గాస్కనీ వంటి ప్రాంతాలలో ఈ కాగోట్స్ నివసించేవారు. వీరి నేపథ్యంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరిలో కొందరు కుష్ఠురోగుల వారసులుగా పరిగణించి అంటరానివారిగా ముద్ర వేయగా, మరికొందరు ఓడిపోయిన విజిగోతులు లేదా ఇతర తెగల సంతతిగా భావించారు. కారణం ఏదైనా.. ఏ పాపం చేయని ఒక వర్గాన్ని శతాబ్దాల పాటు అంటరానివారిగా చూస్తే పరిస్థితి అక్కడ వ్యవస్థీకృతంగా సాగింది. చర్మం రంగులో గానీ, మాట్లాడే భాషలో గానీ, ఆచరించే మత విశ్వాసంలో కానీ.. స్థానికులతో వీరికి ఎలాంటి తేడాలు లేకపోయినా.. కానీ సామాజిక ముద్ర మాత్రం వారిని వెంటాడింది.
ఈ వివక్ష దేవాలయాల వంటి పవిత్ర ప్రదేశాల్లో కూడా అత్యంత దారుణంగా ఉండేది. క్రైస్తవ మతంలో అందరూ సమానమే అనే సూత్రం.. చర్చిలలో కాగోట్స్ ప్రవేశానికి అవకాశం ఉండేది కాదు. ఒక వేళ అవకాశం న్నా వారి ప్రవేశానికి ప్రత్యేకంగా చిన్న ద్వారాలు ఉండేవి. వారు సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో రాకూడదనే నియమం ఉండేది. చర్చి లోపల కూడా వీరు కూర్చోవడానికి వెనుక భాగంలో విడిగా, వేరుగా బెంచీలు కేటాయించేవారు.
పవిత్ర జలాన్ని అందించే సమయంలో కూడా పూజారికి వారు తగలకుండా ఉండేందుకు పొడవాటి చెక్క చెంచాలను ఉపయోగించేవారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరికి మరణించిన తర్వాత కూడా వారిని సాధారణ స్మశానాల్లో కాకుండా వేరే చోట పాతిపెట్టేవారు. కాగోట్స్ జీవనశైలిపై అనేక ఆంక్షలు అమలులో ఉండేవి. వారు సమాజంలోని ఇతర వర్గాల వారితో వివాహ సంబంధాలు పెట్టుకోవడంపై కఠినమైన నిషేధం ఉండేది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే వారికి మరణదండన వంటి కఠిన శిక్షలు కూడా విధించేవారు. వారు నివసించే ప్రాంతాలు కూడా ప్రధాన గ్రామాలకు దూరంగా.. నదికి అవతలలో, చిత్తడి నేలలకు దగ్గరలో ఉండేవి. ఈ కాలనీలను కాగోటెరీ అని పిలిచేవారు. ఆర్థికంగా కూడా వారిని ఎదగనివ్వకుండా కేవలం చెక్క పనులు, శవపేటికల తయారీ, మేసన్రీ వంటి వృత్తులకే పరిమితం చేశారు.
వ్యవసాయం చేస్తే భూమి అపవిత్రం అవుతుందనే మూఢనమ్మకంతో వారిని భూమికి దూరం పెట్టారు. సామాజిక ఆంక్షలే కాకుండా, అక్కడి స్థానిక చట్టాలు కూడా ఈ వివక్షకు వెన్నుదన్నుగా నిలిచాయి. మార్కెట్లలో వస్తువులను తాకకూడదని, కేవలం కర్రలతో చూపిస్తూ వస్తువులను కొనాలని నిబంధనలు ఉండేవి. ప్రజా బావులు లేదా ఫౌంటైన్ల నుంచి నీరు తాగడం వారికి నిషిద్ధం. ఒకవేళ పొరపాటున ఆ నీటిని తాకితే వారి చేతులను నరికివేసేంతటి క్రూరమైన శిక్షలు అమలులో ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆసుపత్రులు మరియు ఇతర ప్రభుత్వ భవనాల్లోకి వారి ప్రవేశం పూర్తిగా నిషేధం. ఈ విధంగా యూరప్ తన సొంత పౌరులపైనే అంటరానితనాన్ని చట్టబద్ధం చేసి తరతరాల పాటు వివక్ష కొనసాగించారు.
నేటి ప్రపంచంలో ఈ కాగోట్స్ కథను అధ్యయనం చేయడం చాలా అవసరం. వివక్ష అనేది కేవలం చర్మం రంగుకో, ఒక దేశానికో, మతానికో సంబంధించినది కాదు, అది ఒక మానసిక రుగ్మత. జపాన్లో బురకుమిన్, భారతదేశంలో దళితులు, యూరప్లోని జ్యూస్, కాగోట్స్.. వీరందరిపై జరిగిన అన్యాయాలు ఒకే రకమైన మనస్తత్వానికి నిదర్శనం. పశ్చిమ దేశాలు ఎప్పుడూ ప్రగతిశీలమైనవని, వివక్ష అక్కడ లేదని భావించే వారికి ఈ చరిత్ర ఒక కనువిప్పు లాంటిది. అదే సమయంలో ఏ సమాజం కూడా తన చరిత్రలో జరిగిన తప్పులను విస్మరించడానికి వీల్లేదని కూడా ఇది గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సామాజిక అంతరాలు తలెత్తకుండా ఉండాలంటే కేవలం చట్టాలు మారితే సరిపోదు.. ప్రజల మనస్తత్వంలో మార్పు రావాలి. చట్టబద్ధంగా కాగోట్స్పై వివక్ష నేడు తొలగిపోయి ఉండవచ్చు, కానీ వారు అనుభవించిన వేదన చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. నేటికీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఎవరిని ఇతరులుగా చూస్తున్నామో, ఎవరికి అదృశ్య గోడలను సృష్టిస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే శతాబ్దాల పాటు అణచివేతకు గురైన ఇలాంటి వర్గాల పట్ల మనం నిజమైన గౌరవాన్ని ప్రదర్శించిన వారమౌతాం. కాగోట్స్ చరిత్ర మనకు నేర్పే అతిపెద్ద పాఠం.. వివక్షకు సరిహద్దులు లేవు, అది మన ఆలోచనల్లోనే ఉంటుంది.
– సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి
