బెంగాల్–బంగ్లాదేశ్ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు, బంగాళాఖాతం, మయన్మార్, చైనా కారిడార్లు—ఇవి అన్నీ కలిసిన భౌగోళిక వలయం ఈ రోజు భద్రతా భారతదేశ చర్చల్లో ఒక కొత్త, అత్యంత సున్నితమైన రంగంగా ముందుకు సాగుతోంది. ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు, సరిహద్దు భద్రత, జిహాదీ నెట్వర్క్లు, అక్రమ చొరబాట్లు, సనాతన ధర్మ పునరుజ్జీవనం అనే వాదన.. ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం ఎన్నికల రాజకీయాల కంటితో కాకుండా, జాతీయ భద్రతా దృష్టితో చూడాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి.
భారత జాతీయ భద్రతా సమీకరణల్లో ఇప్పుడు ఒక మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు ఆ దృష్టి ఈశాన్య సరిహద్దుల వైపు మళ్లుతోంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, మయన్మార్, బంగాళాఖాతం కలిసిన ఈ భౌగోళిక వలయం ఇప్పుడు దేశ భద్రతా చర్చల్లో నాల్గవ రంగంగా రూపాంతరం చెందుతోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సరిహద్దు దాటి వస్తున్న చొరబాట్లు, జిహాదీ మూలాల విస్తరణ వంటి అంశాలు ఈ ప్రాంతాన్ని అత్యంత సున్నితమైనదిగా మార్చాయి.
చారిత్రకంగా చూస్తే, సుమారు 820 సంవత్సరాల కిందట సేన రాజవంశం పతనమైనప్పటి నుండి బెంగాల్ ప్రాంతం అనేక దాడులకు, రాజకీయ మార్పులకు లోనైంది. 1757 ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాపై రాబర్ట్ క్లైవ్ విజయం సాధించడం, మిర్ జాఫర్ ద్రోహం, తదనంతరం బ్రిటిష్ పాలన ప్రారంభం.. ఇవి బెంగాల్ చరిత్రలో కీలక మలుపులు. ముస్లిం పాలకుల కాలంలో హిందువులు తీవ్రంగా అణచివేయబడ్డారని, అందుకే బ్రిటిష్ సైన్యాన్ని హిందువులు విముక్తిగా స్వాగతించారని కొన్ని వాదనలు, ఇది సమగ్రంగా సమాజంలోని అన్ని వర్గాల అనుభవాన్ని ప్రతిబింబించదని చరిత్రకారులు చెబుతున్నారు.
మొత్తంగా ముస్లిం పాలకుల నుంచి బ్రిటిష్ పాలకుల వరకూ.. అక్కడ నుంచి స్వాతంత్ర్యంతర రాజకీయాల వరకు ఈ ప్రాంతం నిరంతరం మతపరమైన, సామాజికపరమైన ఒత్తిళ్లకు వస్తున్నది. ముఖ్యంగా 1905 నాటి బెంగాల్ విభజన.. 1946 నాటి డైరెక్ట్ యాక్షన్ డే వంటి సంఘటనలు తీవ్ర ప్రభావం చూపాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో జరిగిన హింస, తదనంతర పరిణామాలు ఈ సరిహద్దుల్లో భారీగా జనాభా మార్పులకు కారణమయ్యాయని విశ్లేషకులు.
ప్రస్తుత భద్రతాపరమైన సవాళ్లను గమనిస్తే.. చైనా వ్యూహాత్మక కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా, మయన్మార్ కారిడార్, బంగాళాఖాతంలో పెరుగుతున్న చైనా నౌకాదళ ఉనికి, సిలిగురి కారిడార్పై ఒత్తిడి కేవలం ప్రాంతీయ సమస్యలే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయాల్లో కీలకంగా మారాయి. మయన్మార్లోని భారత సహజ వనరులు, అరుదైన ఖనిజ నిల్వలపై పట్టు కోసం జరుగుతున్న ప్రయత్నాలు తూర్పు సరిహద్దు భద్రతను ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా మార్చేశాయి. ఈ సరిహద్దు రక్షణ అనేది ఇప్పుడు కేవలం సైనిక చర్య మాత్రమే కాక, ఆర్థిక, భావజాల పోరాటంగా కూడా మారింది.
అక్రమ వలసలు, సరిహద్దు రక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మరొక ప్రధాన సమస్యగా పరిణమించింది. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, భూసేకరణ వంటి పనుల్లో జాప్యంపై ఉన్నత న్యాయస్థానాలు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. జాతీయ భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం పక్కన పెట్టలేమని కోర్టులు హెచ్చరించడం ఈ సమస్య తీవ్రతను అనుమానిస్తోంది. స్థానికంగా జరుగుతున్న అరాచకాలను, చొరబాటుదారుల సందేశాలతో సాగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పరిధిని పెంచడానికి కేంద్ర నిర్ణయాన్ని కొన్ని రాజకీయ శక్తులు వ్యతిరేకిస్తుండటం భద్రతా వ్యూహాలకు సవాలుగా మారింది.
మరోవైపు.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన జేఎంబీ, పీఎఫ్ఐ వంటి నెట్వర్క్లు ఈ ప్రాంతాన్ని తమ స్థావరాలుగా మలుచుకుంటున్నాయనే ఆరోపణలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్ల సూచనలతో సరిహద్దు జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అక్రమ పశువుల రవాణా, నకిలీ కరెన్సీ, మదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఈ ఉగ్రవాద నెట్వర్క్లకు ఆర్థిక వనరులు మారుతున్నాయి. ఇది కేవలం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే కాకుండా, దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారుతోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో.. సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలను కేంద్రం తన ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకోవాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థ వంటి అంశాలు దీనికి అడ్డంకిగా మారే అవకాశం, జాతీయ భద్రతను సర్వోన్నతంగా భావించే వర్గాలు ఈ దిశగా రాజ్యాంగ సవరణలు అవసరమని వాదిస్తున్నాయి. స్థానిక రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా సరిహద్దులను పటిష్టం చేయాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈశాన్య సరిహద్దు ప్రాంతం ఇప్పుడు భారత్ ఎదుట ఉన్న అతిపెద్ద భద్రతా సవాలు. అక్రమ వలసలపై కచ్చితమైన ఆధారిత విధానాలు, సరిహద్దుల్లో డేటా నిఘా వ్యవస్థల బలోపేతం మరియు ఉగ్రవాద మూలాల అణచివేత తాత్కాలిక తక్షణమే చేపట్టాల్సిన చర్యలు. అదే సమయంలో, భారతీయ పౌరులందరినీ సమానంగా చూస్తూనే, విచ్ఛిన్నకర శక్తులను ఏరివేసేలా ఒక సమగ్రమైన జాతీయ భద్రతా వ్యూహాన్ని రూపొందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే పరమావధిగా ఈ “నాల్గవ రంగాన్ని” కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చింది, దయచేసి మా పోర్టల్ https://www.teluguone.comను . మీతో షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
