హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో అరెస్టైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలమ్ ఖాన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ముజాహిద్ ఆలమ్ ఖాన్తో పాటు ఆయన కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో వస్తున్న అంశాలు పార్టీ అత్యంత తీవ్రంగా వెలుగులోకి వచ్చింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, తీవ్ర ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు, పాత శత్రుత్వాలు, ఆర్థిక వ్యవహారాల కోణంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
ఖాజా మొయినుద్దీన్ నగరంలో ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాస్పద కేసుల్లో ఆయన వ్యవహరించేవారు. ఆయన హత్యతో న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇక ఈ ఘటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత పేరు ఈ కేసులో రావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్గా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పార్టీలో స్థానం ఉండదనే సంకేతం ఇవ్వడానికి వెంటనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మొదట రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో అమలు చేసిన కాంట్రాక్ట్ కిల్లింగ్ కుట్ర దాగి ఉందని దర్యాప్తులో తేలింది. వక్ఫ్ ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులు, వ్యక్తిగత కక్షలు కలిసి ఈ హత్యకు దారితీశాయని పోలీసులు గుర్తించారు.
2026 మే 23వ తేదీ ఉదయం సుమారు 5:45 గంటల సమయంలో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ తన ప్రతిరోజు అలవాటులో భాగంగా స్విమ్మింగ్కు వెళ్లేందుకు హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని తన నివాసం నుండి బయటకు వచ్చారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న తన వాహనం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, నెంబర్ ప్లేట్లు లేని ఆకుపచ్చ రంగు మహీంద్రా స్కార్పియో వాహనం ఒక్కసారిగా అతివేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఖాజా మొయినుద్దీన్ దాదాపు 10 మీటర్ల దూరం ఎగిరిపడి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స కోసం అబిడ్స్లోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందించారు, పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు.
.webp)