కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలనేవి అత్యంత సహజం. రాష్ట్రాలలో వాటి తీరు మారవచ్చు, నాయకులు మారొచ్చు. కానీ అంతర్గత కుమ్ములాటల సాంప్రదాయం మాత్రం మారడం లేదు. కాంగ్రెస్ మాత్రం దీనిని అంతర్గతంగా ప్రజాస్వామ్యంగా అభివర్ణిస్తుంటుంది. అయితే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యహారాలకు ఆస్కారం ఉండదు. ఎత్తులు, పై ఎత్తులతోనే సరిపోతుంటే.. పాలన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి? మరీ ముఖ్యంగా కర్ణాటక విషయంలో కాంగ్రెస్ సమాధానం చెప్పుకుని తీరాలి.
కాంగ్రెస్ చరిత్రలో ముఖ్యమంత్రులను మార్చడం కొత్తకాదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సిద్ధ రామయ్యను ఆ పదవి నుంచి దించింది. అది కూడా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాంధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్, రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. వారంతా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు.
గత ఎన్నికలలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత సీఎం పదవి కోసం సిద్దరామయ్య, డీకే పోటీ పడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఇరువురూ చెరో రెండేళ్లు సీఎంలుగా ఉంటారంటూ ఓ ఫార్ములా రూపొందించారని చెప్పారు. . ఆ ఫార్ములా ప్రకారం మొదటి రెండేళ్లూ సిద్దరామయ్య, ఆ తరువాత డీకే శివకుమార్ సీఎంలుగా ఉండాలి. అయితే సీఎం పగ్గాలు తీసుకున్న తరువాత సిద్ధరామయ్య ఆ ఒప్పందానికి కట్టుబడలేదు. రెండున్నరేళ్లు కాదు.. మూడేళ్లు పూర్తయినా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి ససేమిరా అన్నారు. దీనితో డీకే శవకుమార్ వర్గంఆయనను ఏదో ఒక రూపంలో ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉంది. దీనివల్ల కర్ణాటక రాష్ట్రంలో పెట్టుబడులు.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. కుంభకోణాలూ వెలుగుచూశాయి.
దీంతో మళ్లీ కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. సిద్దరామయ్య చేత రాజీనామా చేయించింది. దీంతొ అంతా సద్దుమణిగింది అనుకునే లోగానే సిద్దరామయ్య మరో మెలిక పెట్టారు. డీకే శివకుమార్ కేబినెట్లో సిద్దరామయ్య కుమారుడు యతేంద్రకు కీలక శాఖలు అప్పగించాలన్నదే అమెరికా. అంతే కాదు.. యతేంద్రను డిప్యూటీ సీఎంగా నియమించాలని కూడా పట్టుబడుతున్నారని సమాచారం.
ఈ పరిస్థితి ఎలా కాదన్నా కాంగ్రెస్ పై ప్రజలలో ఒక నెగటివ్ భావన తీసుకువస్తుంది. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం పార్టీ అంతర్గత వ్యవహారంలా గుట్టుచప్పుడు కాకుండా సాగాలి కానీ, ఇలా రోడ్డున పడి వివాదాలకు ఆస్కారం ఉంటే.. ప్రజలలో పార్టీ పట్ల చులకన భావం ఏర్పడుతుంది. పరిపాలించమని అప్పగిస్తే పంచాయతీలతోనే సరిపెట్టేస్తారా? అని జనం నిలదీస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీఎంల మార్పులు జరిగాయి. కానీ ఏ సందర్భంలోనూ ఆ పార్టీలో ఈ స్థాయి వివాదం రోడ్డున పడలేదు. రచ్చకెక్కలేదు. గుజరాత్ రాష్ట్రంలో పలుమార్లు సీఎం మార్పు జరిగింది. అదంతా కూడా సాఫీగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా సాగిపోయింది.
అలాగే తాజాగా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారిని సీఎంగా ఎంపిక చేయడంలో కూడా బీజేపీ సాఫీగా పని చేసింది. అస్సాంలోనూ అంతే.
కాంగ్రెస్ పార్టీ కేవలం కర్ణాటకతోనే కాదు.. ఆ మధ్య తెలంగాణలో కూడా.. తాజాగా కేరళలో కూడా ఇదే తీరైన వాతావరణాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానం కోసం ఒక కీలక నాయకుడు భారీగా పైరవీలు చేశారు. చివరికి కొంతమంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు కూడా చేశారు.
ఇక కేరళలో కూడా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడ్డాయి. వేణుగోపాల్ సీఎం అని చెప్పి.. చివరకు సతీషన్ కు ఆ పదవి కట్టబెట్టింది. ఆ సందర్భంగా క్యాంపు రాజకీయాలు జరిగాయి.
ఈ స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు, వివాదాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎలా తలపడగలదు? అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుస పరాజయాల తరువాత కూడా కాంగ్రెస్ తీరు మారకపోవడం ఆ పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు.
.webp)