కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేతగా గుర్తింపు పొందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ విద్యార్థిగా మారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న మావోయిస్టు ఉద్యమంలో ఒకప్పుడు కీలక నేతగా గుర్తింపు పొందారు.
ఆయన పేరు ఉత్తర తెలంగాణ, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతా ల్లో జరిగిన మావోయిస్టు కార్యకలాపాల్లో మారు మోగింది. దేవ్ జీ దాదాపు 42 ఏళ్లపాటు మావోయిస్టుగా అజ్ఞాతంలో ఉన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి…. జనారణ్యంలో కలవాలంటూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పలువురు మావోయిస్టులు లొంగిపో యిన విషయం తెలిసిందే. ఆ విధంగా అజ్ఞాతం వీడి లొంగిపోయిన తిమ్మరి తిరుపతి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష రాయనున్నారు.
తిప్పిరి తిరుపతి తన చిన్నతనంలోనే అంటే ఇంటర్ చదువుతున్న సమయంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉన్న కేసులు, పరిస్థితుల కారణంగా ఆయన ఇంటర్ తెలుగు పరీక్షకు హాజరు కాలేకపోయారని చెప్పారు. అయితే మిగిలిన సబ్జెక్టుల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఆయన మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. దీంతో ఆయన విద్యా ప్రయాణం ఇంటర్ వద్దే నిలిచిపోయింది.
ఇప్పుడు పరిస్థితులు మారడంతో జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ.. చదువుకొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇంటర్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండటంతో ఇంటర్ బోర్డ్ ప్రత్యేక అనుమతితో కోరుట్లలో పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ చేసి ముందు ముందు న్యాయవాద వృత్తిని ఎంచుకోవాలని, అందుకు అనుగుణంగా.. లా కోర్సులో ప్రవేశం పొందాలంటే ఇంటర్ పూర్తి చేయడం అవసరం కాబట్టి ఇప్పుడు సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడం విద్య ఒక మార్గమని తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఆచరణలో చూపినట్లు చెప్పారు.
.webp)