భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (92). తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు ఆలపించిన ఈ మధురగాయని, హిందీతో పాటు సుమారు 18 భాషల్లో పాటలు పాడి విశేష ఖ్యాతి పొందారు. 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా గుర్తింపు పొందారు.
ఆశా భోస్లే 1943లో మరాఠీ సినిమాతో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించగా, 1948లో ‘చునారియా’ చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కేవలం సినీ గీతాలకే పరిమితం కాకుండా గజల్స్, భజన్లు, పాప్, క్లాసికల్ వంటి విభిన్న సంగీత శైలుల్లోనూ తన ప్రతిభ చాటుకున్నారు.
తన అద్భుతమైన సేవలకు గాను 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
సంగీతంతో పాటు నటనలోనూ తన ప్రతిభను చాటిన ఆశా భోస్లే, 2013లో ‘మాయి’ హిందీ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసి ప్రేక్షకులను మెప్పించారు. సంగీత ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచిన ఆమె, తరతరాలకు ప్రేరణగా నిలుస్తోంది.
