ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయఢంకా మోగించింది. లక్నో సూపర్ జెయింట్స్తో తలపడిన ఈ మ్యాచ్లో యువ ఆటగాడు సమీర్ రిజ్వీ తన అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టు ఓటమి అంచు నుంచి గెలుపు తీరాలకు చేర్చాడు. కేవలం 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఢిల్లీని రిజ్వీ తన కీలక అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చివరికి 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ ఘన విజయం సాధించింది.
ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు మొదటి నుంచే పట్టుబడ్డారు. లుంగి ఎంగిడి, నటరాజన్ పదునైన బంతులతో లక్నో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగియకముందే లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో జట్టులో అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం అత్యంత దారుణంగా సాగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిస్సంకలతో పాటు కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో జట్టు 4.3 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లక్నో విజయం దాదాపు ఖాయమని భావించాడు, సమీర్ రిజ్వీ (70 నాటౌట్) అద్భుతమే చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) తో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రిజ్వీ, మైదానం నలుమూలల ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
రిజ్వీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తోడుగా స్టబ్స్ కూడా సమయోచితంగా ఆడటంతో ఐదో వికెట్కు వీరిద్దరూ 119 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. యువ ఆటగాడు సమీర్ రిజ్వీ కనబరిచిన ఈ పోరాటపటిమపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
