హైదరాబాద్ నగర భద్రతను కుడిపేసేలా ఓ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ చంచల్గూడ కేంద్ర కారాగారాన్ని కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు నగర భద్రతా వ్యవస్థను అప్రమ త్తం చేశాయి. జైలులో ఉన్న ఓ ఉగ్రవాది మూలాఖత్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ బయట ఉన్న తన అనుచరులతో రహస్యంగా సమాచార మార్పిడి జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారంతో పోలీసులు, దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటికే నగరం లో వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా మూసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్లోని తదితర ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బృందాలు అనుమానాస్పద కదలికలను నిశితంగా గమనిస్తూ, బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దించి తనిఖీలు జరుగుతున్నాయి. నిఘా వర్గాల ప్రకారం లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ఓ ఖైదీ జైలులోనే కుట్రకు మార్గదర్శనం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ములాఖత్కు వచ్చిన వ్యక్తులతో రహస్య సంకేతాల ద్వారా ఉగ్రదాదుల ప్రణాళికపై చర్చలు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని భార్య ద్వారా సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ ఘటనతో జైలు భద్రతా వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ములాఖత్ విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నాయా? సందర్శకుల తనిఖీ ప్రక్రియలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జైలులోని సీసీ కెమెరా దృశ్యాలు, సందర్శకుల రిజిస్టర్లు, కాల్ డేటా, ఖైదీల కదలికలు తదితర వివరాలను జైలు సీసీలో విశ్లేషిస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు గా సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించాయని సమాచారం అందించాలని పోలీసులకు సూచించారు.
