తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా క్షమించరాని నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు లేఖ రాశారు.
కల్తీ నెయ్యి సరఫరా చేసి మహా పాపానికి ఒడిగట్టిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే లడ్డూ ప్రసాదంలో గతంలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని ఆ లేఖలో సుభుదేంద్ర స్వామి, కోట్లాదిమంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అపవిత్రం క్షమించరాని మహా అపరాధమన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా ఉన్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా.. ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
