పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ ప్రధానిగా ఉండగా ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇమ్రాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుడికన్ను చూపు 85 శాతం కోల్పోయినట్లు ఇమ్రాన్ పరిస్థితిని పరిశీలించేందుకు సుప్రీం పంపిన అమికస్ క్యూరి ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది.
తమ సమకాలీకుడైన ఆ మాజీ స్టార్ క్రికెటర్కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్ ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. 14 మంది మాజీలు సంతకాలు చేసిన ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో టీమ్ ఇండిమా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు. వారిద్దరే కాకుండా వివిధ దేశాల మాజీ కెప్టెన్లు మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రేర్ లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిందా క్లాక్, డేవిడ్ గ్రోవర్, కిమ్ హ్యూస్, నాజిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.
పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. రావల్పిండి జైలులో ఉన్న ఆయన విషయంలో అక్కడి సిబ్బంది నిర్దయగా, అమానుషంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది. జైలు గదిలో దీర్ఘకాలంగా ఒంటరిగా ఉండటంతో ఆయన కంటి చూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని సుప్రీంకోర్డు నియమించిన న్యాయవాది పరిశీలనలో వెల్లడైంది. ఈ పరిణామాలపై స్పందించిన సుప్రీంకోర్డు వెంటనే ఇమ్రాన్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇప్పుడు 14 మంది అంతర్జాతీయ క్రికెట్ మాజీ కెప్టెన్లు ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ కెప్టెన్సీలోనే 1992లో పాక్ జట్టు వరల్డ్ కప్ గెలిచింది.
.webp)