
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కరీంనగర్ కార్పొరేషన్ తామే స్వాధీనం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. మేయర్ పీఠం తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కరీంనగర్ మేయం పదవిని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా దక్కించుకుంటుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరీంనగర్ మేయర్ ఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో పూర్తి మెజార్టీ లేకనే బిజెపి ధర్మపురి అరవింద్ మేయర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. మరి కరీంనగర్లో మెజార్టీ లేకపోయినా బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ ఎన్నిక జరుగుతుందని, అందరినీ కలుపుకొని పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిజెపి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో, తాము కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్, ఛైర్పర్సన్ ఎన్నికల సమయంలో సహజంగానే క్యాంపు రాజకీయాలు ఉంటాయని. కాంగ్రెస్ ప్రభుత్వం నగరాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
నిజామాబాద్ ను వదిలేశారు..
నిజామాబాద్ కార్పొరేషన్ లో మేయర్ పీఠం దగ్గరదాకా వెళ్లిన బీజేపీ.. అనూహ్యంగా చేతులెత్తేసింది. అటు ఎంఐఎం మీద ఆధారపడాల్సిన పరిస్థితి.. ఇటు కాంగ్రెస్ నుంచి ఎవరూ వచ్చే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ ఆశలు వదిలేసుకుంది. చివరకు కాంగ్రెస్, ఎంఐఎం మధ్య అవగాహనతో ఇక, ఇందూరు హస్తానికి చిక్కినట్టు.
కరీంనగర్ కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ !
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (జనతా పార్టీ) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే పూర్తి మెజార్టీ రా ఇండిపెండెంట్ అభ్యర్థులను బీజేపీ వైపు తిప్పుకోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (34) కోసం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకంగా మారింది.
బీజేపీకి మద్దతు తెలిపిన నలుగురు ఇండిపెండెంట్లు..
కరీంనగర్ లో గెలిచిన నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కమలం గూటికి చేరడంతో బీజేపీ బలం 34కు పెరిగింది. ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు బీజేపీలో చేరారు, తాజాగా మరో ఇద్దరు (వి. కవిత, ఎం. గణేష్) పార్టీలో చేరారు. దీంతో మేయర్ పీఠం దక్కించుకున్నందుకు కావాల్సిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. దాంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని తేలిపోయింది. సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలపై ఉత్కంఠ.