
పాతతరం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది నటీనటుల వ్యక్తిగత జీవితాలు అస్తవ్యస్తంగా ముగిశాయి. వారిలో నటిమణులే ఎక్కువ శాతం ఉంటారు. సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోవడం, చేసుకున్నా.. రెండో పెళ్లి, మూడో పెళ్లి వాళ్లను చేసుకోవడం, ఆ తర్వాత కష్టాల పాలు కావడం మనం చూశాం. మరికొందరు అసలు పెళ్లే చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు. అలాంటి ఓ వింత పరిస్థితి ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రేఖా వేదవ్యాస్కి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేసింది. అయితే ఆమె చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది.
తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 2001లో వచ్చిన ఆనందం చిత్రంతో పరిచయమైంది రేఖ. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నా పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు ఇతర సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. 2012 తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపించే రేఖ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది.
‘గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా చాలా కుంగిపోయాను. గతంలో నాకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకుంటుందామంటే నా పరిస్థితి చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏదో తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాలకంటే, ఆలస్యమైనా మంచి సంబంధం కావాలన్నది నా అభిప్రాయం’ అని అంటున్నారు రేఖ.