వైసీపీలో సస్పెన్షన్లు ప్రజలను మభ్యపెట్టడానికేనా అంటే ఔనన్న సమాధానమే వస్తుంది. ఏ పార్టీ అయినా సరే క్రమశిక్షణ ఉల్లంఘించినందుకో, నేరారోపణలు ఎదుర్కొంటున్నందున ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లేదా నాయకుడిని సస్పెండ్ చేస్తూ.. అలా సస్పెన్షన్ కు గురైన వ్యక్తిని దూరంగా ఉంచుతుంది. పార్టీ కార్యక్రమాలలోకి ఎంట్రీ ఇవ్వదు. పార్టీ అధినేతనైతే అసలు కలిసే ఛాన్సే ఉండదు. ఆ సస్పెన్షన్ ఎత్తివేసేంత వరకూ ఆ సస్పెన్షన్ కు గురైన వారి నీడ కూడా పార్టీ దరిదాపుల్లో పడనీయరు.
కానీ వైసీపీలో అటువంటి పరిస్థితి ఇసుమంతైనా కనిపించదు. పార్టీలో ఉన్న వారి కంటే సస్పెన్షన్ కు గురైన వారికే పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందా అనిపించేలా పార్టీ అధినేత వ్యవహరిస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైసీపీ అధినేత జగన్ తన ప్రతిపక్ష హోదా డిమాండ్ కు తిలోదకాలిచ్చి సభకు మద్దతు పలికారు. తనతో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఆయన సభకు హాజరైన ఓ పదకొండు నిముషాల పాటు సభలో వాకౌట్ చేశారు. అది పక్కన పెడితే.. సభ నుంచి వచ్చే సమయంలో అసెంబ్లీ ఆవరణలో ఆయనను పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీలో సస్పెన్షన్లు ఉత్తుత్తివేనా అన్న చర్చకు తెరలేచింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరంటే..
కారు డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ అనంత్ బాబు, కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల్లో రచ్చరచ్చ చేసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ ఇరువురూ కూడా అసెంబ్లీ ఆవరణలో జగన్ వెంట ఉన్నారు. జగన్ వారితో మాట్లాడారు. పార్టీ వాయిస్ వినిపించమని. తాడేపల్లి వచ్చి కలవమని చెప్పారు కూడా. వీరిరువురిలో ఎమ్మెల్సీ అనంతబాబు అయితే హత్య, డోర్ డెలివరీ కేసులో అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జనాల నుంచి వీరిపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే జగన్ తో వారు కలిసి నడవడం, జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడటం చూస్తుంటే.. ఆ సస్పెన్షన్లు ప్రజలను మభ్యపెట్టడానికి ఉత్తుత్తి సస్పెన్షన్లుగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
