పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట జీవితంలో కల్లోలం. నాలుగు నెలల గర్భిణి అయిన యువతిపై బలవంతంగా గర్భస్రావం చేయించే ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ జోక్యం చేసుకుని తక్షణ చర్యలు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహేష్ , భాగ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.. దీంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
జనవరి 30న యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. ఇప్పటికే భాగ్య నాలుగు నెలల గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.వివాహం అనంతరం భాగ్యను ఆమె తండ్రి, బావ కలిసి ఒత్తిడి చేసి కల్వకుర్తి సమీపంలోని ఓ ఆసుపత్రిలో గర్భస్రావం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు మహేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ పరిణామాల వల్ల మనస్తాపానికి గురైన భాగ్య ఆత్మహత్యకు ప్రయత్నించింది.ఈ ఘట నపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రియుడు… మహిళ సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని, తన భార్యకు ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. ఈ పరిశీలన పరిశీలించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై వెంటనే స్పందించింది.
మహిళ స్వేచ్ఛ, శారీరక స్వాతంత్ర్యంపై దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా కనిపిస్తోంది. మహిళ సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. కల్వకుర్తి సీఐ, వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలను ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఈ కేసును నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విచారణ జరపాలని సూచించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై ఫిబ్రవరి 26న సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. బాధిత యువతికి రక్షణ కల్పించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించింది.
