జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ ప్రజల మధ్య కులచిచ్చు పెడుతోందని ఘాటుగా స్పందించారు. కులం పుట్టుకతో వచ్చేదే తప్ప ఎంపిక కాదన్న నాగబాబు.. అభివృద్ధి జరగాలంటే.. అధిక సంఖ్యలో ఉన్న కులాల వారు అల్ప సంఖ్యలో ఉన్న కులాల వారికి అండగా నిలవాలన్నదే జనసేనాని పవన్ కల్యాణ్ భావన అని చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కొతతార రామకృష్ణ విజయమే ఇందుకు నిదర్శనంగా చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో నలభై శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి కాకుండా గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు జనసేన టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని నాగబాబు గుర్తు చేశారు. అంతే కాకుండా వైసీపీకి సూటిగా ఐదు ప్రశ్నలు సంధించి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
2024 ఎన్నికల్లో కాపులు, బలిజలు ఎక్కువగా ఉంటే, రాయలసీమ ప్రాంతంలో వైసీపీ కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చింది? 2014లో కాపుల కంచుకోట అయిన రాజంపేటను మిథున్ రెడ్డికి కట్టబెడుతుంటే.. కాపు సామాజిక వర్గానికి తామే లయన్, టైగర్ అని జబ్బలు చరుచుకుంటున్న అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడ తలదాచుకున్నారు? వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాను పార్టీ నుంచి బయటకు పంపి.. రంగాను దూషించిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ పదవీ ఇస్తుంటే వీరంతా ఏం చేస్తున్నారు? పిఠాపురంలో పవన్ ని ఓడించడానికి మిథున్ రెడ్డిని పంపి.. అదే పవన్ని తిట్టడానికి మాత్రం పేర్ని వంటి వారిని జగన్ ఎందుకు ప్రయోగిస్తారు? కాపు నేస్తం పథకానికి వైయస్ పేరు పెట్టడమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని నాగబాబు సవాల్ చేశారు. ముందు ఈ ప్రశ్నలకు బదులిచ్చిన తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ ను నిలదీయాలని వైసీపీలోని కాపు నేతలను నాగబాబు చాలెంజ్ చేశారు.
వైసీపీ వారికి నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుందన్న శాపముందని.. అందుకే వారు ఏ విషయంలోనూ నిజాలు చెప్పరనీ నాగబాబు పేర్కొన్నారు. ఇది అసలే జెన్ జీ కాలం.. యూత్ ఏఐ తో యమ వేగంగా ఉందన్న నాగబాబు.. ఇంకా రాంబాబు వంటి వారు పాత కాలపు రాజకీయాలు చేస్తూ జనంలో కుల చిచ్చు రగలుస్తామంటే చూస్తూ ఊరుకోర’ని వార్నింగ్ ఇచ్చారు.
.webp)