ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డిపై నెటిజనులు ఉత్తర కుమారుడు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబుపై లేఖాస్త్రాలు సంధించడంలో ఎప్పుడూ ఉంటారు. ఇటీవలి కాలంలో అంటే గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది.. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆయన దాదాపుగా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు అంటే ఎన్నికలకు ముందే.. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభం తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.
అది పక్కన పెడితే… అంతకు ముందు అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమం పూర్తిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పటి విపక్ష నేత జగన్ కు అనుకూలం అని అప్పట్లో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఆపేశారు. కాకుండా జగన్ సర్కార్ కు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కారణంగా ఆయన కాపు సామాజికవర్గానికి దూరం అయ్యారు. ఆ ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనంతో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయింది. ఆ తరువాత నుంచీ దాదాపుగా సైలెంట్ అయిపోయిన ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు తాజాగా తన పెన్ను విదిల్చారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు జరగడంతో ఇప్పుడు మళ్లీ ఆయన కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం వ్యతిరేకం అంటూ గొంతు సవరించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరుగుతోందంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో పంపించేయడానికి కంకణం కట్టుకున్నారా? అంటే ఆ లేఖలో చంద్రబాబు, లోకేష్ లను ప్రశ్నించారు. అయితే ఈ లేఖపై నేటిజనులు ముద్రగడను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కు కాపుసామాజిక వర్గం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుఓడిస్తానని శపథం చేసినప్పుడు, వైసీపీ అధినేత సహా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అయినా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న ముద్రగడకు కాపు సామాజిక వర్గం ప్రతినిథిగా చెప్పుకునే నైతికత ఎక్కడిదని విమర్శిస్తున్నారు.
.webp)