ఏపీ సీఎం చంద్రబాబుపై.. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి తెలుగుదేశం శ్రేణులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కాగా తాను చంద్రబాబును దూషించలేదనీ, తనను అడ్డగించి దుర్భాషలాడుతున్న వారిపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా.. తాను అలా మాట్లాడి ఉండకూడదని కూడా చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.
ఇలా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చి అంబటి రాంబాబు నివాసం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఇంటి ఆవరణలో ఉన్న అంబటి కారును, ఆయన వ్యక్తిగత కార్యాలయాన్ని ఆందోళనకారుల ధ్వంసం చేశారు. రాళ్లతో దాడి చేయడంతో ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ముక్కలయ్యాయి. అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు.దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తెలుగుదేశంశ్రేణులను నియంత్రించారు. మరో వైపు అంబటి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఫైర్ అయ్యారు. మంత్రి పార్థసారథి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య అంబటి వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. తక్షణమే అంబటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
