విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) లో రేడియోగ్రఫీ విభాగం మరోసారి వివాదంలో పడింది. ట్రామా కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఎక్స్-రే రిపోర్టులు మిస్సవడం తీవ్ర కలకలం రేపుతోంది.
వాస్తవానికి ట్రామా విభాగంలో సీనియర్ సిబ్బంది అందుబాటులో ఉన్నా, వారు డ్యూటీకి మంగళం పలుకుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల సహకారంతో సీనియర్లు బాధ్యతలు పక్కన పెట్టి, కొత్తగా నియమితమైన జూనియర్ల చేత పనులు చేయిస్తున్నారని సమాచారం.
ఈ అనాధికారిక విధుల పంచకం వల్ల విభాగంలో గందరగోళం నెలకొంది. రోగులు ఎక్స్-రే గదుల బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ట్రామా మరియు రేడియోగ్రఫీ విభాగాల మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇటీవల ట్రామా కేసులకు సంబంధించిన ఎక్స్-రే రిపోర్టులు మిస్సవడం, రోగులు మరియు వారి బంధువుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది సీనియర్ల నిర్లక్ష్యం, డిపార్ట్మెంట్ లో రాజకీయాల ఫలితంగా చూస్తున్నారు.
ఇది ఒక్కటే ఘటన కాదని, ఇటువంటి ఉదాసీనత కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. జూనియర్లపై అధిక భారం పడుతుండటం, పర్యవేక్షణ లేకపోవడం రోగులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
సిబ్బంది నిర్లక్ష్యం పై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్యూటీలను పునఃపరిశీలించాలని ప్రజలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.