కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. తనయుడు శివాన్ ఎర్రంనాయుడు తొలి తలనీలాలు అర్పించే సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి కాలినడకన కొండపైకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు అలిపిరి మెట్ల మార్గంలో ప్రయాణం ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు కుటుంబం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల చేరుకుంది.
వెంకటేశ్వర స్వామిపై అపార భక్తి విశ్వాసాలు కలిగిన రామ్మోహన్ నాయుడు, ఆయన సతీమణి శ్రీశ్రావ్య భావనతో మెట్ల మార్గంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామ్మోహన్ నాయుడు సుమారు వెయ్యి మెట్లకు పైగా బొట్లు పెట్టి, హారతులు ఇస్తూ కొండపైకి చేరుకోగా.. ఆయన సతీమణి శ్రీశ్రావ్య మాత్రం మొత్తం 3,500 మెట్లకూ బొట్లు పెట్టి హారతులు ఇస్తూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం తనయుడు శివాన్ ఎర్రంనాయుడు తొలి తలనీలాలు సమర్పించగా.. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
.webp)