భవిష్యత్తులో తన ప్రయాణం పూర్తిగా ప్రజల మద్దతుపైనే ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని, సెంటిమెంట్ ఎక్కువైన ఆమె.. మంచి మూహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత. ప్రజలే తనను నాయకురాలుగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని తెలియజేసారు. బీఆర్ఎస్తో తనకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేసిన కవిత.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎందుకు ప్రచారం చేయడం లేదని కవిత ప్రశ్నించారు. జాగృతి సంస్థ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో హరీశ్ రావు ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. అలాగే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
తనపై విమర్శలు చేస్తున్న వారిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గుంటనక్క, గూఢచారి’ వంటి పేర్లు వారికి నప్పుతాయి కాబట్టే అలా పిలుస్తున్నానన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాను కూడా మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, కొత్త పార్టీ ప్రకటనతో కొత్త చర్చ మొదలవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
.webp)