జనవరి 22, 2026 2:45PMన పోస్ట్ చేయబడింది

విధి నిర్వహణలో లేకపోయినా, అంకిత భావంతో చంటిబిడ్డను చంకనెత్తుకుని మరీ రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన అందరి చేత సెభాష్ అనిపించుకున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం (జనవరి 22) తన నివాసంలో సత్కరించారు. సంక్రాంతి పండుగ కాకినాడ కెనాల్ రోడ్డుపై చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి మహిళా అంకితభావం ప్రదర్శించిన జయశాంతిని బుధవారం స్వయంగా ఫోన్ చేసి అభినందించిన హోంమంత్రి అనిత.. గురువారం విజయవాడలో తన క్యాంప్ సందర్భంగా ఘనంగా సత్కరించారు. తను ఆ రోజు డ్యూటీలో లేకపోయినా, తరువాత కూడా ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజల ఇబ్బందులను గమనించిన జయశాంతి చేతిలో చంటిబిడ్డతోనే ట్రాఫిక్ ను నియంత్రించి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అంబులెన్స్ కు దారి సుగమం చేశారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాధ్యత సామాజికతో జయశాంతి చేసిన డ్యూటీ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విషయం హోంమంత్రి అనిత దృష్టికి రావడంతో ఆమె స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు. ఆ సందర్భంగా జయశాంతిని కుటుంబ సమేతంగా తన నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ మేరకు జయశాంతి తన భర్త, ఇద్దరు పిల్లలతో విజయవాడలోని వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జయశాంతికి అనిత బొట్టు పెట్టి, చీర, గాజులు బహూకరించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని చెప్పారు.
