జనవరి 22, 2026 2:07PMన పోస్ట్ చేయబడింది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. కోటప్పకొండలో గురువారం (జనవరి 22) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన అంతకు ముందు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పాదాభిషేక సేవలో ఉన్నారు. పూజ అనంతరం పవన్ కల్యాణ్ కోటప్ప కొండ నుంచి కొత్తపాలెంకు నిర్మించిన కొత్త రోడ్డుకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ధర్మం, ధైర్యం, సేవ ఈ మూడే తన ఆదర్శమనీ, ఆదర్శాలకు అనుగుణంగా నడుస్తున్నానని చెప్పారు. తాను ఎప్పుడూ ఇలానే నడుచుకుంటానన్నారు. కోటప్పకొండ పర్యటన తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టంగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
అంతకు ముందు కోటప్పకొండ పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవిం దబాబు, జిల్లా అధికారులు, రవాణాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, జనసైనికులు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి కోటప్పకొండ ఆలయం వరకు, ఆలయం నుంచి నూతన రహదారి ప్రారంభోత్సవం వరకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, కూటమి పక్షాల కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి పూలు, హారతులతో స్వాగతం పలికారు.
