జనవరి 19, 2026 11:55AMన పోస్ట్ చేయబడింది
మెట్రోపాలిటన్ సిటీగా అమరావతి
స్వయం ప్రతిపత్తి కల్పించే ఆలోచన
నిబంధనల రూపకల్పనపై కసరత్తు
పన్నులు, భూ అమ్మకాలపైనా సొంత నిర్ణయం
యూజర్ ఛార్జీల వసూలుకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు వీలుగా నిబంధనలు రూపొందిస్తున్నాయా? అమరావతి పిపిపి (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) దిశగా అడుగులు వేస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. అమరావతికి . స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా నిబంధనలను రూపొందించారు. స్వయం ప్రతిపత్తికి వీలుగా రూపకల్పన నిబంధనలు ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్లు బ్యాంకు నియమించిన సంస్థలు లేదా వ్యక్తుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి. నెలరోజుల్లో ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి (మానిటైజ్) హక్కులను కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో తయారవుతున్న చట్టాలుగా అమరావతి క్యాపిటల్సిటీ పరిపాలన నిబంధనలు నిలవబోతున్నాయి. ముఖ్యంగా మూలధన ఆర్థిక వనరులను అంచనా వేసి స్థిరమైన రాబడి, పిపిపి, ప్రైవేట్ పెట్టుబడికి అవసరమైన విధంగా డిజైన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించబడుతుంది.
దీనికోసం ప్రస్తుతం ఉన్న ఎపిసిఆర్డిఎ చట్టాలను పరిశీలించి, 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయనున్నారు. నిబంధనల రూపకల్పన కోసం ఢిల్లీ, ఛండీగడ్, నయా రాయపూర్, డొలెరా కంపెనీలు, పరిపాలన సంస్థలతోపాటు అంతర్జాతీయంగా సింగపూర్, బ్రెసీలియా, పుత్రజయ, సెజోంగ్, నసుంతారా, జోహాన్స్బర్గ్, ఆస్తానా నగరాల్లో పాలనా నిబంధనలను పరిశీలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలను రూపొందించనున్నారు. పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీలను నియమించేందుకు వీలుగా చట్టాలను రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సిఆర్డిఎ చట్టం నుండి పరిపాలనా కేంద్రంగా మార్చేందుకు దశలవారీ ప్రణాళికను రూపొందించనుంది. దీని కోసం రాజధానిలో కనీసం మూడు వర్కుషాపులు నిర్వహించి అభిప్రాయాలు నిర్ణయించారు. ప్రస్తుతం రాజధాని నగరం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రూపొందించే నిబంధనలు దశలవారీ అభివృద్ధి, జనాభాకు వీలుగా మార్చుకునే ప్రతిపాదనలు ఉన్నాయి.
గత ఏడాది జులైలో ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో అమరావతికి ప్రత్యేక చట్టం కావాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. ఆ సెమినార్లో ప్రభుత్వం నుండి అమరావతికి ఆర్థిక మద్దతు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం, భూములను ఆర్థిక వనరులుగా మార్చుకోవడంపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వీటిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని అమరావతి మధ్య ఆర్థిక పంపిణీ జరిగేలా చట్టాన్ని రూపొందించనుంది.
.webp)