జనవరి 15, 2026 2:25PMన పోస్ట్ చేయబడింది

దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అతను నటించిన చివరి సినిమా ‘జన నాయకన్’ విడుదల ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా విడుదలకు ఆదేశాలు జారీ చేయమంటూ నిర్మాతలు సుప్రీమ్ కోర్టు తలుపు తట్టగా, అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు ఈ కేసులో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.
దాంతో పిటీషనర్ తరఫు న్యాయవాది రోహత్గి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, వెంటనే తీర్పు ఇచ్చేలా చూడమని న్యాయమూర్తులకు విన్నవించుకున్నారు. రోహత్గి అభ్యర్థన మేరకు ఈను మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోమని, అయితే ఈ నెల 20లోగా తీర్పు వెలువర్చమని జస్టిస్ దీపాంకర్ దత్తా, న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మషి పేర్కొన్నారు.
మద్రాస్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ప్రతికూల తీర్పుపై సి.బి.ఎఫ్.సి. ద్విసభ్య ధర్మాసనంకు వెళ్ళింది. కేసును ప్రాథమికంగా విచారించిన న్యాయమూర్తులు సినిమా విడుదలపై స్టే విధించారు, కేసును ఈ నెల 20కి వాయిదా వేశారు. దాంతో ‘జన నాయకన్’ నిర్మాత సుప్రీమ్ కోర్టుకు వెళ్ళి మీకు న్యాయం చేయాలని అన్నారు.
కానీ అక్కడ కూడా వారికి చుక్కెదురై తిరిగి ఈ వ్యవహారం చెన్నయ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కోర్టులో పడింది. ఈ లోగా రివైజింగ్ కమిటీ సినిమాను చూసి ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి. వాటిని నిర్మాతలు అంగీకరిస్తే, సినిమా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకవేళ కోర్టు కూడా సుప్రీమ్ కోర్టు సూచనలను అనుసరించి, 20వ తేదీకి తుది తీర్పు ఇచ్చినా… ఈ నెల 23వ తేదీ లేదా 30న ‘జన నాయకుని’ జనం ముందుకు రావచ్చు.
