డిసెంబర్ 17, 2025 4:24PMన పోస్ట్ చేయబడింది

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజుకు పెరుగుతోంది. జనం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అల్లాడుతున్నారు. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా రికార్డు అయింది. దీంతో ‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా బొగ్గు, వంట చెరుకుతో తయారు చేసే తందూరీ రోటీలపై బ్యాన్ విధించింది. డీపీసీసీ నిర్ణయం ప్రకారం సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు, తిను బండారాలు అమ్మే షాపులు తందూరీ రోటీలను గ్యాస్ లేదా కరెంట్లను మాత్రమే వాడుకోవాలి.
కాలుష్య నివారణలో భాగంగా వాహనాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పొల్యూషన్ అండర్ ఉన్న కంట్రోల్ సర్టిఫికెట్ వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు. పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఢిల్లీ, ఎన్సీఆర్లోని పెట్రోల్ స్టేషన్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అమ్మరని తేల్చి చెప్పారు. జీఆర్ఏపీ 3, 4 సందర్బంగా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ కలిగిన వాహనాలు ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ .. ఆన్ గ్రౌండ్ చెక్స్ ద్వారా వాహనాలకు సంబంధించిన పీయూసీసీ స్టాటస్, ఎమిషన్ క్యాటగిరీ చెక్ చేస్తాం. పీయూసీసీ సర్టిఫికెట్ లేని వారు.. బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ వాహనాలను వాడుతున్న వారు పెట్రోల్ బంకుల దగ్గర, సరిహద్దు అధికారులతో గొడవలకు దిగవద్దు. గురువారం నుంచి కొత్త రూల్ అమల్లో ఉంటుంది. గత నవంబర్ నెలలో ఏక్యూఐ 20 పాయింట్లు తగ్గాయి. గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు. 9 నుంచి 10 నెలల్లో గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన పని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కాలుష్యమనే రోగం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రజలకు క్షమాపణ చెప్పారు.
